జగన్ వెంట్రుక పీకడానికి తెలుగు ప్రజలకు తీరిక లేదు : మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు

కుప్పం నియోజకవర్గం గుడిపల్లెలో నిర్వహించిన జయహో బీసీ సభలో మాజీ ఎంఎల్సీ గౌనివారి శ్రీనివాసులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు

By Medi Samrat  Published on  29 Jan 2024 1:53 PM GMT
జగన్ వెంట్రుక పీకడానికి తెలుగు ప్రజలకు తీరిక లేదు : మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు

కుప్పం నియోజకవర్గం గుడిపల్లెలో నిర్వహించిన జయహో బీసీ సభలో మాజీ ఎంఎల్సీ గౌనివారి శ్రీనివాసులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు కంటే గొప్పగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దారుణంగా మారిపోయిందని అన్నారు. జగన్ చెప్పిన మాటలను నమ్మి ప్రజలు దారుణంగా మోసపోయారని తెలిపారు.

అమరావతిలో అకారణంగా ప్రజావేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డి కూల్చి వేయించారని.. కేవలం చంద్రబాబు నాయుడును మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే తప్ప మరొకటి లేదని అన్నారు. అప్పుడెప్పుడో ఓ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ వెంట్రుక కూడా పీకలేరని అన్నారని.. మీ వెంట్రుకలు పీకడానికి మీ ఇంట్లో ఎవరికైనా తీరిక ఉందేమో కానీ.. రాష్ట్ర ప్రజలకు లేదని తెలుసుకోవాలన్నారు గౌనివారి శ్రీనివాసులు. ఒకప్పుడు వైనాట్ 175 అని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు మాత్రం దిగిపోడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారంటే ఓటమి భయం సీఎం జగన్ లో మొదలైందని అన్నారు.

సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు మాత్రమే కాదు.. తోడబుట్టిన చెల్లెలు షర్మిల కూడా సిద్ధమైందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు గౌనివారి శ్రీనివాసులు. బీసీలకు మంచి చేసింది స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. అకారణంగా ఎంతో మంది బీసీలను జైలుకు పంపిన చరిత్ర సీఎం జగన్ ది. అందుకు తానేనన్నారు గౌనివారి శ్రీనివాసులు. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వస్తున్నప్పుడు.. ఎందుకు వైసీపీ జెండాలు కట్టారని అడిగినందుకు తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. 29 రోజులు జైలులో గడిపానని గుర్తు చేసుకున్నారు గౌనివారి శ్రీనివాసులు. బీసీలకు మంచి జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలని పిలుపును ఇచ్చారు.

Next Story