మరోసారి వార్తల్లో దస్తగిరి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

By Medi Samrat  Published on  14 Nov 2023 3:45 PM GMT
మరోసారి వార్తల్లో దస్తగిరి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలని తన పిటిషన్ లో కోరాడు. అంతేకాకుండా కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరాడు. గతంలో సీబీఐ చార్జిషీట్ లో తనను సాక్షిగా చేర్చిందని దస్తగిరి వివరించాడు. దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు రేపు విచారించనుంది. వివేకా హత్య కేసులో దస్తగిరి ఏ-4గా ఉన్నాడు. అయితే అప్రూవర్ గా మారిన అనంతరం అతడికి బెయిల్ లభించింది.

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు కొద్దిరోజుల కిందటే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 30 వరకూ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. డిసెంబర్ 1న 10.30 గంటలకు చంచల్‌గూడ్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. కోర్టులో తన పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కూడా భాస్కర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. చికిత్సకు వెళ్లాల్సి వస్తే ఆ వివరాలను కూడా సీబీఐకి తెలపాలని స్పష్టం చేసింది. కుటుంబసభ్యులను తప్ప మిగతా ఎవ్వరినీ కలవొద్దని కూడా భాస్కర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 20న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌ మంజూరు కాగా.. ఆ బెయిల్‌ను ఇంటరిమ్ బెయిల్‌గా మారుస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story