చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు.

By అంజి
Published on : 29 April 2024 2:30 PM IST

CM YS Jagan, election campaign,Chodavaram, APPolls

చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా: సీఎం జగన్

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. మేనిఫెస్టో విడుదల తరువాత తనదైన శైలిలో జనంలోకి దూసుకుపోతున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ.. పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అనకాపల్లిలోని చోడవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌ మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు.

'చంద్రబాబు దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర దోచుకున్నదే. ఓటుకు రూ.4 వేలు ఇస్తానని ఆయన అంటారు. చంద్రబాబు డబ్బులు ఇస్తే తీసుకోండి. మంచి చేసే వారికే ఓటు వేయండి. చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా.. గోవిందా. లంచాలు, వివక్ష లేని పాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి' అని సీఎం జగన్‌ కోరారు. జగన్‌కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు.

2014లో చంద్రబాబుకి ఓటేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని జగన్‌ ఆరోపించారు. గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. చంద్రబాబు వస్తే వర్షాలు కూడా రావని అన్నారు.

Next Story