ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు.

By అంజి  Published on  22 Aug 2024 2:02 AM GMT
CM Chandrababu, sand offline booking process, APnews

ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు. స్టాక్‌ పాయింట్లలో ఇసుక ధర, దూరాన్ని బట్టి ఛార్జీలను ప్రకటిస్తారు. ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్నవారినే అనుమతించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.

ఇకపై ప్రతి రోజూ ఇసుక సరఫరా జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ, ఈ మెయిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ : 1800-599-4599, ఈ మెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక రవాణ ఛార్జీలను నోటిఫై చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

ఉచిత ఇసుక సరఫరాపై ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని, ఇసుక అక్రమ తవ్వకాలు..రవాణను కట్టడి చేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం తేల్చి చెప్పారు. ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలని, బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా కట్టడి చేయాలని సీఎం ఆదేశించారు. బుకింగ్ ఇన్వాయిసుల తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణ ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చూడాలని, నోటిఫై చేసిన ఇసుకను రవాణా ధరల కంటే..ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story