ఆగస్టు 31న కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీనీవా నీళ్లు: సీఎం చంద్రబాబు

సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By Knakam Karthik
Published on : 1 Aug 2025 8:30 AM IST

Andrapradesh, Cm Chandrababu, Water Resources Department officials

ఆగస్టు 31న కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీనీవా నీళ్లు: సీఎం చంద్రబాబు

అమరావతి: సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్ధ నీటి నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్య స్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నదుల్లోకి ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మం సాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లన్నీ నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సగటున ప్రతీ రోజూ 4 టీఎంసీల మేర నీటిని తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులను నింపే అవకాశం ఉందో చూడాలని సీఎం సూచించారు.

వీలైనంత మేర నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా రివర్ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లను నింపాలన్నారు. గండికోట, మైలవరం, పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి మరోవైపు వీటిని నింపాలని సూచిచారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, హంద్రీనీవా నుంచి జీడిపల్లి రిజర్వాయర్ కు కూడా నీటిని తరలించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటిని తరలించాలని స్పష్టం చేశారు. వీలైనంత వరకూ వ్యయం లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు.

Next Story