పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం..పీ4పై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

p4 –జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు

By Knakam Karthik
Published on : 11 July 2025 7:50 AM IST

Andrapradesh, Cm Chandrababu,  Zero Poverty program

పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం..పీ4పై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు

అమరావతి: పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్- పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్దం చేస్తోంది. త్వరలో మార్గదర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. పీ4 –జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పీ4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. అయితే ఆగస్టు 15వ తేదీ నాటికి ఒక లక్ష మంది మార్గదర్శులను గుర్తించేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.

ఈ మేరకు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు.. మార్గదర్శిగా ఉండే వారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మార్గదర్శులుగా ఉండే 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 18వ తేదీన అమరావతిలో వీరిని డిన్నర్ కు ఆహ్వానించాలనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్దంగా ఉన్న అనేక వర్గాల వారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. .

Next Story