రాష్ట్రంలో కోటి మొక్కల ప్లాంటేషన్..పచ్చదనం పెంచడమే సర్కార్ టార్గెట్

ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు

By Knakam Karthik
Published on : 2 Jun 2025 5:30 PM IST

Andrapradesh, Cm Chandrababu, Plantation, One Crore Plants

రాష్ట్రంలో కోటి మొక్కల ప్లాంటేషన్..పచ్చదనం పెంచడమే సర్కార్ టార్గెట్

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని కావాలని, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇది గతేడాది 29 శాతం వరకు గ్రీన్ కవర్ ఉందని, ఈ ఏడాదికి 30.5 శాతానికి పెరిగిందని సీఎం అన్నారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37 శాతానికి, 2047కి 50 శాతానికి చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు.

ప్రతి ఏడాది కనీసం 1.5 శాతం మేర గ్రీన్ కవర్ పెరగాలన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఫారెస్ట్‌తో కలిపి ఎంత గ్రీన్ కవర్ ఉందో స్పష్టమైన సమాచారం శాటిలైట్ల సాయంతో సేకరించాలని, అలాగే ప్రతీ ప్లాంట్‌ను ట్యాగ్ చేయాలన్నారు. రాష్ట్రం ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉండాలని, మొక్కలు నాటి వదిలేయడం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకువస్తే వారికి అవకాశం కల్పించే విధానం తీసుకురావాలని సూచించారు. అమరావతి పరిధిలోని అన్ని రిజర్వ్ అటవీ ప్రాంతాలను మియావకీ తరహాలో పచ్చదనం పెంచి, 3 ఏళ్లలో ఫలితాలు కనబడాలన్నారు.

Next Story