గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సీఎం..ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్, త్వరలోనే ఆ పదవుల భర్తీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం..అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

By Knakam Karthik
Published on : 14 March 2025 2:53 PM IST

Andrapradesh, Cm Chandrababu, Teleconference, MLAs, MPs

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సీఎం..ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్, త్వరలోనే ఆ పదవుల భర్తీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం..అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలి. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలి. గ్రూప్ రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలి. పర్యటనల సంఖ్య పెరగాలి. కార్యకర్తలు, నాయకులతో మమేకం అవ్వడంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలి. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు. నేను ఈ విషయాన్ని చెబితే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ పరమైన సంబంధాలు వేరు. వైసీపీ వారిని దరి చేరనివ్వొద్దు...అని సీఎం చంద్రబాబు వార్నింగ ఇచ్చారు.

నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నాం. పేర్లను సిఫారసు చేయకుండా కొంత మంది నేతలు ఆలస్యం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పార్టీ కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదవుల కోసం అందించాలి. సరైన వ్యక్తులకు సరైన పదవుల్లో నియమిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్‌లకు నియమిస్తాం. నామినేటెడ్ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. అన్నింటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. పదవులు తీసుకున్నట్లు కాదు, ఎన్నికల్లో ప్రభావం చూపించాలి. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో, ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలి.. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన మనం అందించాలి..అని సీఎం స్పష్టం చేశారు.

సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించడం మన విధానం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలి. 2 కిలో వాట్‌ల రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనంగా అందిస్తాం. కేంద్రం రాయితీతో కలిపి బీసీలకు రూ.80 వేల మేర రాయితీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటే లక్ష్యం పెట్టుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో మీ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ప్రజా ప్రతినిధులు ముందుకెళ్లాలి..అని సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story