ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదు : సీఎం చంద్రబాబు
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హర్షం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Feb 2025 8:37 PM IST
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వానికి, సుస్థిర పాలనకు పట్టం కట్టారు. ఇది దేశ ప్రజలందరి గెలుపు. గత ఐదేళ్లలో ఏపీలో, ఢిల్లీలోని ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్పై కాటేశారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లి నివాసంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు సుస్థిర పాలన అందిస్తున్న ప్రధాని మోదీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మనదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు.
పీపుల్స్ ఫస్ట్ నినాదానికి ఢిల్లీ ఫలితాలు ఉదాహరణ
ప్రపంచంలో ఎక్కడికిపోయిన మనది భారతదేశం అంటాము. ఢిల్లీ రాజధాని అని చెబుతాము. ఎవరైనా సరే మంచి భవిష్యత్ , అవకాశాల కోసం రాష్ట్ర రాజధాని , దేశ రాజధానికి వెళ్లాలనుకుంటారు. కానీ వెదర్ పొల్యూషన్ , పొలిటికల్ పొల్యషన్ కారణంగా ప్రజలు ఢిల్లీకి వెళ్లడం మానేసి ఇతర ప్రాంతాలకు వెళతున్నారు. ఒకప్పుడు ప్రతిరోజూ బీహార్ నుంచి ఢిల్లీకి కార్మికులు వెళ్లేందుకు ట్రైన్ ఉండేది. కొన్నేళ్లుగా వారు ఢిల్లీకి రావడంలేదు. ఒక్కోసారి పరిస్థితులు తారుమారు అవుతాయి అనడానికి ఢిల్లీనే ఉదాహరణ. ప్రపంచంలో ఎక్కడైన పీపుల్స్ ఫస్ట్ నినాదమే పనిచేస్తుందనడానికి ఈ ఢిల్లీ ఎన్నికలే ఉదాహరణ. అభివృద్ధి జరగితే సంపద సృష్టించవచ్చు. సంపద వస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. తలసరి ఆదాయం పెంచి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చు. గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్ ఎంతో ముఖ్యం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 34 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఢిల్లీ రాజధానిగా బ్రిటీష్ పాలన అమలయ్యేది.మద్రాసు, కలకత్తా ఇలా ప్రెసిడెన్సీలు ఉండేవి. హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలు ఉండేవి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలకు ముందు మన గ్రోత్ రేటుపై ప్రపంచం ఎగతాళి చేసేది. మన తెలుగుబిడ్డ పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. 1995లో మహారాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తి 55 బిలియన్ యూస్ డాలర్లు.. అది 2024 నాటికి 490 బిలియన్ యూస్ డాలర్లు అయ్యింది. అంటే 9 రెట్లు వృద్ధి చెందింది. గుజరాత్ ...24 బిలియన్ యూస్ డాలర్లు కాగా ఇప్పుడు 370 బిలియన్ యూస్ డాలర్లు ...అంటే 15 రెట్లు పెరిగింది. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 3000 డాలర్ల తలసరి ఆదాయం ఉంది. 1995లో ఆర్థిక సంస్కరణలు రాగానే టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకెళ్లాము. జనాభా ,నియంత్రణపైనా దృష్టి పెట్టాము. పబ్లిక్ పాలసీలు తెచ్చాము. పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడ్డాము. ఐటీని ప్రమోట్ చేశాము. అదే సమయంలో సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో అభివృద్ధి చేశాము. సుస్థిర పాలన, సమర్థ నాయకత్వంతోనే గుజరాత్ లో వృద్ధి రేటు పెరిగింది.
దేశానికి సరైన నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ
మోదీ నాయకత్వంలో మన దేశం అభివృద్ధిలో నెంబర్ వన్ అవుతుంది. కొందరు సంక్షేమం ఇస్తున్నామని మాయమాటలు చెబుతూ అవినీతి చేస్తున్నారు. దీంతో ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడు చేయడం, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అవమానించడం చేస్తున్నారు. దానికి ఏపీ, ఢిల్లీనే ఉదాహరణ. ఢిల్లీలో సరైన విద్యావకాశాలు లేవు. ఆస్పత్రులు లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి. ఢిల్లీ మొత్తం గార్భేజ్ గా మారింది. యమునా పొల్యూషన్ తో నిండిపోయింది. ప్రపంచంలోనే పొల్యూటెడ్ సిటీ ఢిల్లీ. ఒకప్పుడు దేశానికి సైన్యమంతా పంజాబ్ నుంచే వచ్చేవారు. దేశానికి కావాల్సిన ధాన్యం, గోధుమలు సరఫరా చేసేవారు. ఆ రాష్ట్రంలో ఐదు నదులు ఉన్నాయి. కానీ నేడు పంజాబ్..డ్రగ్స్ మయమైంది. ప్రతిరోజూ పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే రోగుల కోసం ఒక రైలే వస్తోంది వస్తోంది . 2047 నాటికి రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉండాలి. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42,000 డాలర్లుకు చేరాలి. మంచి నాయకత్వంతో ముందుకెళ్తే 2047 నాటికి మన దేశమే నంబర్వన్ గా నిలుస్తుంది. 2047 నాటికి దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఏపీలోనే ఉండాలన్నది మా లక్ష్యం. అలాగే రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు రావాలి.
సంపద సృష్టించలేనివారికి బటన్ నొక్కే అర్హత లేదు
ఢిల్లీ ప్రజలు కొంత సమయం తీసుకున్నారు కానీ మన ఏపీ ప్రజలు బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొందారు. గత ఐదేళ్లలో పాలకులు చిన్న, పెద్దా లెక్కలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. లిక్కర్ లో జోక్యం చేసుకున్న కుటుంబాలు బాగుపడవు. అది పాపిష్టి డబ్బు. పేదవారి ఆరోగ్యాన్ని నాశనం చేసి ఎంజాయ్ చేసే అధికారం పాలకులకు లేదు. లిక్కర్ మాఫియాను నడిపారు. వ్యవస్థలను నాశనం చేశారు. దేవతలు ద్యానం చేసిన రిషికొండ ప్రాంతంలో ప్యాలెస్ కట్టుకున్నారు. ఢిల్లీలోనూ శేషమహల్ కట్టారు. అక్కడా, ఇక్కడా ప్యాలెస్ లోకి వారు వెళ్లలేదు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఓటేసిన పాపానికి కాటేశారు. విధ్వంసం చాలా సులభం. నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. మొత్తం ప్రజల అవకాశాలను సర్వ నాశనం చేశారు. సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వ ఆదాయం పెంచలేని వ్యక్తులకు బటన్ నొక్కే అర్హత లేదు. ప్రజలకు సంక్షేమం అందించి , రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి . అదే సుస్థిర పాలన. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలుగా మనందరం ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం కాబట్టి ఏం చేసినా పర్లేదు , ఇష్టానుసారంగా మాట్లాడతానంటే కుదరదు.
వాట్సాప్ గవర్నెన్స్పై అనవసర రాద్ధాంతం
మనందరిపై గురుతర బాధ్యత ఉంది. నేను వ్యక్తులను విమర్శించడం లేదు. వారు అవలంభించిన సిద్ధాంతాల వల్ల ప్రజలకు మేలు జరగలేదని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అని నాయకులు గుర్తుంచుకోవాలి. జగన్ రెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగానే గెలిపించారు. ప్రతిపక్ష నేతగా కాదు. విలువలు లేని వారు విలువలపై మాట్లాడటం సబబు కాదు. నా అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ 60 దేశాల్లో నిరసనలు తెలిపారు. తెలంగాణలోనూ నిరసనలు జరిగాయి. వాటిని అణగదొక్కాలని చూశారు. కానీ ఏమైందో అందరం చూస్తున్నాం. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. నేడు ఆదరణ కోల్పోయారు. 1995లో నేను ప్రజలను చైతన్య పరిచాను. నేడు నరేంద్రమోదీ అదే చేస్తున్నారు. నేడు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన అందిస్తున్నాను. ఏ ఆఫీసర్, ఏ కార్యకర్త తప్పు చేసినా నాదే బాధ్యత. సాంకేతికత సాయంతో ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని నేను మంత్రులకు చెబితే వక్రీకరించి రాస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి ఇష్టానుసారంగా పక్కదారి పట్టిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.