కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
By - Medi Samrat |
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. సేంద్రీయ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన అంశాన్ని భేటీలో శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. PM-PRANAM పథకం కింద AP కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం వల్ల ఇచ్చే PM-PRANAM ప్రొత్సాహకాలను ఇవ్వాలని వినతించారు. 2024-25 సంవత్సరానికి గాను చెందిన రూ.216 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
2024-25 సంవత్సరంలో సాగులో రసాయనాల వినియోగం 2.28 శాతం మేర తగ్గించామని.. రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రీయ సాగును ప్రొత్సహిస్తున్నామని.. ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లల్లో సేంద్రీయ సాగుకు మొగ్గు చూపుతూ సమ్మతి తెలిపారని కేంద్ర మంత్రిని కోరారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు ముఖ్యమంత్రి. కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు ఆధునాతన పద్దతులపై ట్రైనింగ్, నర్సరీల విస్తరణకు సహకరించాలని కోరారు. కొబ్బరి రైతులకు లాభం చేకూర్చేలా.. సుమారు 15 వేల మందికి ఉపాధి కలిగించేలా ప్రాసెసింగ్ పార్క్, మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు పని చేస్తాయని వెల్లడించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం చంద్రబాబు.
ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్లో తోతాపూరి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్రం ఇవ్వాల్సిన వాటాను కూడా ఇప్పటికే తోతాపూరి మామిడి రైతులకు చెల్లింపులు జరిపింది రాష్ట్ర ప్రభుత్వం. ధరలు పడిపోవడంతో ఇబ్బందులు పడ్డ తోతాపూరి మామిడి రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాటాను కలిపి మొత్తంగా రూ.200 కోట్ల చెల్లింపులు జరిపింది. ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. ఏపీలో కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని.. అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు సీఎం.