చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. దీనివల్ల 93 వేల మంది నేతన్నల గృహాలకు, 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.
ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేల సహకారం అందజేసేందుకు.. అలాగే చేనేత కార్మికులకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. వీటన్నింటినీ నెరవేర్చడానికి.. చేనేత రంగ అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.138.08 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. చేనేత కార్మికులకు నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సహకారాన్ని అందుకుని నేతన్నలు వృద్ధిలోకి రావాలని కోరారు.