డీలిమిటేషన్పై వారి మౌనం సరికాదు: వైఎస్ షర్మిల
డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి
డీలిమిటేషన్పై వారి మౌనం సరికాదు: వైఎస్ షర్మిల
డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని తెలిపారు. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి.. సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పనిలేకుండా పోతుందన్నారు. సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదన్నారు. డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్లా చేస్తామంటే ఊరుకునేది లేదని, జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు.
''కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే... దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144. ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ,బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 222 సీట్లు పెరిగితే.. సౌత్ మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం. ఇది కాదా దక్షిణ భారతంకి జరిగే అన్యాయం?'' అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా మోదీకి బుద్ధి రాదని అన్నారు. ఏపీలో మోడీ పక్షం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే. ప్రజల హక్కులను కాలరాసినట్లే. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం నోరు విప్పకపోవడం మోడీకి పరోక్ష మద్దతు అని ఒప్పుకున్నట్లే. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టీ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలని షర్మిల అన్నారు.