'ఏపీ సంక్షేమమే ధ్యేయం.. పదవులపై ఆసక్తి లేదు'.. అమిత్‌ షాతో ఫోన్‌ కాల్‌లో చంద్రబాబు

లోక్‌సభ స్పీకర్ ఎంపిక విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

By అంజి  Published on  23 Jun 2024 1:18 PM GMT
Chandrababu, Amit Shah, APnews

'ఏపీ సంక్షేమమే ధ్యేయం.. పదవులపై ఆసక్తి లేదు'.. అమిత్‌ షాతో ఫోన్‌ కాల్‌లో చంద్రబాబు

అమరావతి: లోక్‌సభ స్పీకర్ ఎంపిక విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఈ విషయం టీడీపీకి పట్టింపు లేదని స్పష్టం చేశారు. మహాకూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పదవులపై ఆసక్తి లేదని, ఆంధ్రప్రదేశ్ సంక్షేమమే ధ్యేయం అని ఉద్ఘాటించారు. ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఈ సందేశాన్ని అందించారు. పదవులపై దృష్టి సారిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని పునరుద్ఘాటించిన ఆయన, పదవులు ప్రధానం కాదని అందరికీ గుర్తు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

ఒక్కో ఎంపీకి మూడు శాఖలు కేటాయిస్తామని, రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకుని కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టాలని సూచించారు. అన్నింటికీ మించి రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వాలని ఎంపీలను చంద్రబాబు కోరారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పోలవరం, అమరావతి నిర్మాణం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలతో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వైఖరిపై చంద్రబాబు చర్చించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి, కోశాధికారిగా దగ్గుమళ్ల ప్రసాద్‌ను చంద్రబాబు నియమించారు.

Next Story