జగన్ ఇలాకలో మహానాడు జరుగుతోందని కొందరు మీడియా మిత్రులు రాస్తున్నారని, 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా కావొచ్చని, కానీ, 2024 ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసిందన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి). కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు మహానాడు నిర్వహించలేదని, చరిత్రలో తొలిసారిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బీటెక్ రవి తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు కృషితోనే నేడు పులివెందుల హార్టికల్చర్ హబ్గా మారిందని, ఇక్కడ పండిస్తున్న అరటి, బత్తాయి పంటలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని బీటెక్ రవి తెలిపారు. పులివెందులకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని, గత ఏడాది కూడా పులివెందుల ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కడప జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన చుట్టూ ఉన్న కేసుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడానికే ప్రాధాన్యత ఇచ్చారని, జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో అనేక మంది ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లారు. ఇప్పుడు జగన్ రెడ్డి వల్ల అధికారులు జైలుకు వెళతారని జోస్యం చెప్పారు.