శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా శ్రీశైల క్షేత్రంలో భారీగా భక్తులరద్దీ ఉందని.. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉందని.. ముందస్తుగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా ఈ వారంలో 15న మంగళవారం నుంచి 18న శుక్రవారం కల్పించే ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. భక్తులందరూ మార్పును గమనించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో కోరారు.