ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో పథకం అమలుకు సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకం కింద కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు కలిపి అర్హత కలిగిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో రూ.20 వేలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ నెల చివరి నాటికి పీఎం కిసాన్ యోజన నిధులను కేంద్రం జమ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే రోజు అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుఉక ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు సమాచారం. రైతులకు 20వ విడత పీఎం కిసాన్ కింద రూ.2 వేలు రావాలన్నా, అన్నదాత సుఖీభవ కింద నిధులు అందుకోవాలన్న రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పీఎం కిసాన్కు సంబంధించి ఈ కేవైసీ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి pmkisan.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి.
ఆర్థికంగా బాగా ఉన్నవారు, మాజీ, ప్రస్తుత ఎంపీలు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు మొదలైన రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్నవారికి ఈ పథకం కింద నిధులు రావు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసేవారు, స్థానిక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు, నెకు రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారిని ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.