మీడియా ముందే కన్నీరు పెట్టుకున్న అచ్చెన్నాయుడు!

Atchannaidu Felt Emotional. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా ముందే కన్నీరు.

By Medi Samrat  Published on  9 Feb 2021 3:02 PM GMT
Atchannaidu Gets Bail

జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే రోజు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అక్కడ అచ్చెన్నాయుడు సతీమణి సర్పంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. భారీ బందోబస్తు మధ్య నిమ్మాడలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

జైలు నుంచి విడుదలైన తర్వాత అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.వైసిపి విధ్వంస విధానాలతోనే విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో టిడిపి కార్యకర్త కాశీరాం బలవన్మరణానికి పాల్పడ్డారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు.. ఇంకా ఎంతమంది బలహీన వర్గాలవారు బలికావాలని నిలదీశారు. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వైసిపి నేతల దుశ్చర్యను ఆయన ఖండించారు.

వైసిపి నేతలు పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక.. అడ్డదారులు తొక్కుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. కాశీరాం మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.



Next Story