అందుకు సీఎం జగన్ బ్రాండ్ ఇమేజే ప్రధాన కారణం : మంత్రి రోజా

AP Tourism Minister RK Roja. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఒప్పందాలు

By Medi Samrat  Published on  7 March 2023 4:00 PM GMT
అందుకు సీఎం జగన్ బ్రాండ్ ఇమేజే ప్రధాన కారణం : మంత్రి రోజా

AP Tourism Minister RK Roja


ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 41,412 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడలు మ‌రియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. ఈ మద్యే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటకల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కూడా పర్యాటక రంగానికి సంబందించి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదని ఆమె అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ ఇమేజే ప్రధాన కారణమని ఆమె తెలిపారు.

మంగళవారం వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎంతో విజయవంతం అయిందంటూ కేక్ ను కట్ చేసి ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరవ్వడమే కాకుండా రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీఎత్తున ఒప్పందాలు జరిగాయని తద్వారా 6.09 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు ఆమె తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అయిన అంబానీ, అధానీ, దాల్మియా, ఒబెరాయ్, జిఎంఆర్ వంటి అతిరథ మహారధులు ఈ సదస్సుకు హాజరవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వారు ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దిలో మేమూ పాలు పంచుకుంటామని వారంతా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ సమర్థవంతమైన పాలన అందజేస్తున్న ఫలితంగా రాష్ట్ర జి.ఎస్.డి.పి. గ్రోత్ 2022 లో 11.43 శాతం రావడమే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ గత మూడేళ్ల నుండి ప్రథమ స్థానంలో నిలవడం, ఎగుమతుల్లో నాల్గో స్థానంలో, రెలిజియస్ టూరిజంలో ప్రధమ స్థానంలోను, జనరల్ టూరిజంలో మూడవ స్థానంలోను నిలవడం జరిగిందన్నారు. ఇటువంటి సమర్థవంతమైన పాలన అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై పూర్తి నమ్మకం, విశ్వాసంతోనే పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలి రావడం జరిగిందన్నారు.

రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో జరిగిన మొత్తం 129 ఒప్పందాలను సాద్యమైనంత త్వరగా అమలుపర్చి ఏడాది కాలంలోనే వాటన్నింటినీ గ్రౌండ్ అయ్యేలా చూసేందుకు కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకోవడమే కాకుండా పర్యాటక శాఖ పరంగా పర్యాట శాఖ స్పెషల్ సి.ఎస్. మరియు ఏపి టూరిజం డెవలెమ్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. స్థాయిల్లో రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ ఉత్తమ పర్యాటక విధానాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఫలితంగా రాష్ట్ర పర్యాటక రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం జరిగిందని ఆమె తెలిపారు.


Next Story