ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించిన మంత్రి అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By - అంజి |
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించిన మంత్రి అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం (ఏప్రిల్ 5, 2026) ఏపీ ఎన్జీవోస్ (APNGOs) అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాయీ వేణుగోపాల్ను మంత్రి అచ్చెన్నాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సమన్వయం అవసరమని అన్నారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారి సహకారంతోనే ప్రజా సంక్షేమ పథకాలు విజయవంతమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో, రాయీ వేణుగోపాల్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కొన్ని నెలల క్రితమే కొత్త పీఆర్సీ నియమించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గొందు శంకర్, దళిత సంఘాల జేఏసీ నాయకులు టైక్వాండో శ్రీను, కాంత వేణు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి, అలాగే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి వేణుగోపాల్ అందిస్తున్న సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు.