ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం సచివాలయంలో నూతన కమీషనర్లతో ప్రమాణం చేయించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమీషనర్ సహా ఇతర కమీషనర్లను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమీషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర సమాచార కమీషన్ చీఫ్ కమీషనర్ గా వజ్జా శ్రీనివాసరావుతో ముందుగా సిఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. తదుపరి పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, చరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిచే సమాచార కమీషనర్లుగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమీషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, ఆర్టీఐ అధికారులు, నూతన ఆర్టీఐ కమీషనర్ల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.