కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది..వంశీ అరెస్ట్ సక్రమమేనన్న ఏపీ హోంమంత్రి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 3:55 PM IST
కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది..వంశీ అరెస్ట్ సక్రమమేనన్న ఏపీ హోంమంత్రి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు. వంశీ అరెస్ట్ కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ల అరెస్టులు సక్రమం.. మా ప్రభుత్వంలో వైసీపీ వాళ్ల అరెస్టులు అక్రమమా అని ఆమె ప్రశ్నించారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు అని ఏపీ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. కాగా ఆ ఆరోపణలు సరికాదు అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను డీజీపీ కార్యాలయం గేటు దగ్గరకు కూడా వెళ్లనీయ లేదని హోంమంత్రి అనిత చెప్పారు.
అలాగే, విజయనగరంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ఓ బులెట్ బాగ్ మిస్సవడం దురదృష్టకరం.. దానిపై విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, రానున్న బడ్జెట్ లో ప్రజల రక్షణే ప్రాధాన్యతగా హోంశాఖకు ప్రత్యేకంగా కేటాయింపులు రానున్నాయి.. కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం.. గత ప్రభుత్వం హోం శాఖకు సంబంధించి 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కనపెట్టింది.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 73 పథకాలను పునరుద్ధరించామని హోంమంత్రి అనిత వెల్లడించారు.
కాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్టు, రిమాండ్ వ్యవహారం ప్రస్తుత పరిణామాలతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ, తాజాగా కిడ్నాప్ మరియు బెదిరింపుల ఆరోపణలపై ఏ1గా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన వంశీ, ప్రస్తుతం రిమాండ్లో జైల్లో ఉన్నాడు. అయితే, బెయిల్ పొందడం ఈ సమయంలో అతనికి చాలా కష్టంగా ఉండబోతోందని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై ఈ కేసులు నమోదవడం, రాజకీయంగా మరింత వేడి పెంచింది, దీనితో ఆయన రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కష్టాలు ఎదుర్కొనాల్సి ఉండొచ్చని భావిస్తున్నారు.