గుడ్‌న్యూస్ : త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని 14,493 ఉద్యోగాల భ‌ర్తీ..!

AP govt to finalise the probation of grama Sachivalaya employees by June. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రక్రియను జూన్‌ నెలాఖరులోగా ఖరారు

By Medi Samrat  Published on  28 Jan 2022 4:33 AM GMT
గుడ్‌న్యూస్ : త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని 14,493 ఉద్యోగాల భ‌ర్తీ..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రక్రియను జూన్‌ నెలాఖరులోగా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది.

ఈ స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలోని ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ను కోరినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ను ఆదేశించారు. ప్రస్తుతం గ్రామాల్లో 11,162 సచివాలయాలు, పట్టణాల్లో 3,842 మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయని సచివాలయ ప్రత్యేక కార్యదర్శి సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,493 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు త్వరలో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు.


Next Story