23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాలో 23,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

By -  అంజి
Published on : 15 Sept 2025 10:15 AM IST

AP govt, industrial park , Sri Sathya Sai district, APnews

23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాలో 23,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో కోడికొండ చెక్ పోస్ట్ సమీపంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు గతంలో కేటాయించిన భూమి కూడా ఉంది. ప్రతిపాదిత పార్క్‌ను 16 పరిశ్రమ-నిర్దిష్ట జోన్‌లుగా విభజించనున్నారు. ఇవి అంతరిక్షం, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్, డ్రోన్‌లు, ఐటీ వంటి రంగాలను కవర్ చేస్తాయి. విశాఖపట్నం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన అదే సంస్థ లీ అండ్ అసోసియేట్స్ ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది.

23,000 ఎకరాలలో.. గతంలో లేపాక్షికి కేటాయించిన సుమారు 8,844 ఎకరాలకు మధ్యలో ప్రైవేటు భూములు ఉన్నాయి. ఇప్పుడు అధికారులు వాటిని సేకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే పని డిసెంబరు నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. APIIC టేకులోడు సమీపంలో 2,000 ఎకరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది, ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 14,000 ఎకరాల లక్ష్యంతో ఉంది.

రైతులకు పరిహారం ఎకరానికి ₹7–14 లక్షలుగా నిర్ణయించబడింది. దీనికి దాదాపు ₹800 కోట్లు అవసరం. ప్రభుత్వం ఇటీవల సుమారు ₹2,000 కోట్లు సేకరించడానికి అనుమతించిన తర్వాత, దీనిని తీర్చడానికి APIIC ఆర్థిక సంస్థలతో రుణాలు కోసం చర్చలు జరుపుతోంది.

బెంగళూరు విమానాశ్రయం దగ్గర:

ప్రతిపాదిత స్థలం బెంగళూరు జాతీయ రహదారి వెంబడి, దేవనహళ్లి విమానాశ్రయం నుండి దాదాపు 75 కి.మీ దూరంలో ఉంది. బెంగళూరు, చెన్నైలలో పరిశ్రమలకు పరిమితమైన భూమి అందుబాటులో ఉండటంతో.. ఈ ప్రదేశం ప్రధాన ఐటీ, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. విమానాశ్రయానికి ప్రయాణ సమయం కేవలం 90 నిమిషాలు మాత్రమే.

లేపాక్షి సెజ్ భూ వివాదాలు:

లేపాక్షి సెజ్ కు కేటాయించిన 8,844 ఎకరాలను రుణాల కోసం తనఖా పెట్టారు, ఆ తర్వాత అప్పులు డిఫాల్ట్ అయ్యాయి. దీని తర్వాత బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ను ఆశ్రయించగా, ED ఆ భూమిలోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుంది. ఈ వివాదాస్పద భూములలో కొన్నింటిని NCLT చర్యల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

డిసెంబర్ నాటికి మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు, ఆ తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి జోన్ల వారీగా భూమిని కేటాయిస్తారు.

Next Story