గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. ఆయా సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉండాలి, బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలను వెల్లడిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
విధి విధానాలు:
ఈ ఏడాది మే 31 నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్దేశించింది. 5 ఏళ్ల కాలం పూర్తి కానివారు వ్యక్తిగత అభ్యర్ధన మేరకే బదిలీలకు అర్హులని పేర్కొంది. ఉద్యోగికి తన స్వగ్రామం, మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వొద్దని ఆదేశించింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తిచేయాలని ఆదేశించింది.
ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు వారి ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్లో పేర్కొంది.
కాగా ఉమ్మడి జిల్లానే ప్రాతిపదికగా బదిలీలు ఉంటాయని, ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చే సమయంలో పలు కేటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్లో వెల్లడించింది. కంటి చూపు సరిగా లేనివారు, మానసిక రుగ్మతలతో బాధపడే పిల్లలు ఉన్న వారిని మెడికల్ ఫెసిలిటీ ఉన్న చోటికి బదిలీ చేయాలని సూచించింది.