AP: సీఎం జగన్ సర్కార్ గుడ్న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు రెడీ అయ్యింది. 'జగనన్న చేదోడు' పథకం కింద నాలుగో విడత ఆర్థిక సహాయాన్ని సీఎం లబ్ధిదారులకు అందించనున్నారు.
By అంజి Published on 17 Oct 2023 8:15 AM IST
AP: సీఎం జగన్ సర్కార్ గుడ్న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలుకు రెడీ అయ్యింది. 'జగనన్న చేదోడు' పథకం కింద నాలుగో విడత ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్ లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ నెల 19వ తేదీన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్న సీఎం జగన్.. అక్కడే బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిపాడ్ ఏర్పాటు కోసం పట్టణంలోని ఓ మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ మైదానంలో ఏర్పాటు చేయనున్న సీఎం సభా స్థలిని పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు జేసీ సూచనలు ఇచ్చారు.
జగనన్న చేదోడు పథఖం కింద రజకులు, నాయీ బ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. గడిచిన మూడేళ్లుగా సాయం అందగా, నాలుగో ఏడాది నిధుల విడుదలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ పథకం లబ్ధిదారులు ఆదాయ వనరులను పెంచుకోవడాని, పరికరాలు, అవసమైన వాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈ సాయం చేస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 3.30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఎల్లుండి జరిగే సీఎం సభకు పథకం లబ్ధిదారులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు జేసీ ఆదేశాలిచ్చారు.
ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకునేవారు.. చేదోడు అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, దరఖాస్తుదారు బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్, షాపుతో దరఖాస్తుదారుడు దిగిన ఫోటోతో పాటుగా 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సచివాలయానికి వెళ్లి సంప్రదించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పథకం కింద లబ్ధి పొందిన వారు ప్రస్తుత ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శిస్తారు. అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ప్రభుత్వం మరో ఛాన్స్ కూడా ఇస్తోంది.