అమరావతి: పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను 'షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ - 2025' పేరిట ఇవాళ ప్రభుత్వం సత్కరించనుంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరగనుండగా.. మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగే ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. టెన్త్లో టాపర్లుగా నిలిచిన 4,168 మంది, ఇంటర్లో 920 మందికి ఈ పురస్కారం దక్కనుంది. టెన్త్ విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్మెంట్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, సర్టిఫికెట్ అందజేస్తారు. విద్యలో నాణ్యత, నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీ, పీహెచ్ విభాగాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన 52 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో సత్కరించారు.