అమరావతి: రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో వేటనే జీవనాధారణంగా చేసుకుని బతుకుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మత్స్యకార భరోసా అర్హులకు రూ.20 వేలు సాయాన్ని అందించనున్నట్టు ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున చేపల వేట నిషేధ భృతిని అందజేస్తారు. తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి.
కాగా సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంది. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా భృతిని అందజేస్తోంది. కాగా గతంలో వేట నిషేధం కోసం ఒక్కొక్క మత్స్యకారుడికి రూ.10 వేలు భృతి అందించేవారు. ఇదిలా ఉంటే.. లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. అర్హుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బోటు లైసెన్స్, బోటుతో పాటు మత్స్యకారుల ఫొటోలు తీసుకున్నారు. లబ్ధిదారులందరికీ సాయం అందించనున్నట్టు మత్స్యశాఖ తెలిపింది.