అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం.. మే 15 నుంచి ఇవాళ్టి వరకు బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మరో వారం పాటు పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అప్పటి వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 7 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేయనుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది.