సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
By Knakam Karthik
సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ సైయెంట్, ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యామండలి)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థల్లో వ్యాపార దృక్పథం, మేథోసంపత్తి సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు, సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషిచేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడుదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు.
ఐ-కేర్, ఐ-కేఫ్ సెంటర్స్ ఏర్పాటు
ఈ ఒప్పందంలో భాగంగా i-CARE (Innovation Creation and Research for Entrepreneurship), i-CAFE(Idea Creation and Auxiliary Facilities for Entrepreneurship) కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మేథోసంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలు(IPR-TT Cells) ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యాసంస్థలపై దృష్టిసారించనున్నారు. బూట్ క్యాంప్స్, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. క్లస్టర్ స్థాయి కాంక్లేవులు, పరిశ్రమ నిపుణులతో మార్గనిర్దేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోసం శిక్షణ, సామర్థ్యం పెంపునకు కృషిచేయనున్నారు. వివిధ రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం కోసం నోడల్ ఆఫీస్ గా ఏపీఎస్ఎస్ డీసీ వ్యవహరించనుంది.