త్వరలో మరో కొత్త స్కీమ్.. మహిళలకు రూ.15,000
కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
త్వరలో మరో కొత్త స్కీమ్.. మహిళలకు రూ.15,000
అమరావతి: కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు మహిళల కోసం 'గృహిణి' పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని తెలిపారు. త్వరలోనే ఈ పథకం అమలు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెల్లడికానున్నట్టు సమాచారం. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు 'గృహిణి' పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమానికి రూ.4,600 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కూడా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. 2014లో ఏపీ ప్రభుత్వం కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు, సంక్షేమ పథకాలతో పాటూ వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాపు మహిళల కోసం పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.