గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. గ్రూప్-1 ద్వారా ఖాళీగా ఉన్న 89 పోస్టుల భర్తీకి త్వరలో ఇంటర్వూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నద్ధమవుతోంది. ఏపీపీఎస్సీ విన్నపం మేరకు ఇంటర్వూ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
27 మంది ప్రభుత్వ విభాగాధిపతులను ఇంటర్వూ బోర్డులో నియమించింది. వీరిలో కమిషనర్లు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శుల హోదాలో ఉన్నవారూ ఉన్నారు. ఏపీపీఎస్సీ ఇచ్చే షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వూలు చేయాలని ప్రభుత్వ ప్రతినిధులను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శిని సీఎస్ కె. విజయానంద్ ఆదేశించారు.
విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే మౌఖిక పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే రోజునే ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. క్రీడల కోటాలో 42 మంది అభ్యర్థులకు ఈ నెల 17న ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది.