నకిలీ ఈ స్టాంపుల స్కామ్.. విచారణకు ఆదేశించిన ఏపీ సర్కార్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది.
By అంజి
నకిలీ ఈ స్టాంపుల స్కామ్.. విచారణకు ఆదేశించిన ఏపీ సర్కార్
అమరావతి: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది. నకిలీ ఈ స్టాంపుల సృష్టిపై విచారణకు ఆదేశించినట్టు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కల్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపుల జారీ ఎలా ఉందో పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నకిలీ ఈ స్టాంపులు సృష్టించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫేక్ స్టాంపులు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఈ తరహా ఘటనలు ఏమైనా జరిగాయేమోనని ఆరా తీస్తోంది. ఎర్రప్ప అనే వ్యక్తి మీ సేవా నడుపుతూ నకిలీ స్టాంపులు సృష్టించి, విక్రయించేవాడు. రూ.100వి సైతం రూ.లక్ష విలువైనవిగా అమ్మాడు. ఓ సంస్థ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఇదంతా బయటపడింది. రూ.కోట్లలో జరిగిన ఈ స్కాంపై నిందితుడిని విచారిస్తున్నారు.