ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై నెల రేషన్ను వారికి 4 రోజులు ముందుగానే ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచే వారికి రేషన్ అందించనున్నారు. సమాచార లోపం వల్ల గత నెలలో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకున్నారు. దీంతో సమస్యలు రాకుండా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని సంబంధిత అధికారులకు, డీలర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
డోర్ డెలివరీ విధానం పర్యవేక్షణకు గానూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. జులై నెల రేషన్ పంపిణీ కార్డుదారులందరికీ జులై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపులో పంపిణీ చేయనుండగా, ఈ రోజు నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఆయా రేషన్ షాపు డీలర్లు ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ చేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే చౌక ధరల దుకాణాలకు నిత్యావసర వస్తువుల సరఫరా జరిగింది.