అమరావతి: కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చింది. తాజాగా తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇవాళ సాయంత్రానికి ప్రక్రియ పూర్తవనున్నట్టు అంచనా. సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితా ఉంటుంది. ఈ నెల 20 వరకు అభ్యంతరాలు పంపొచ్చు. జూన్ 30న తుది జాబితా ప్రదర్శించి మిగిలిన అర్హులకు జులై 5న నగదు పంపిణీ చేస్తారు.
నిన్న తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో ఎంఎస్ నెంబర్ 27 (GO MS No. 27) రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున జమ అవుతున్నాయి. ఈ రూ. 15 వేలల్లో 2 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించనున్నారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.