మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
సూపర్ సిక్స్లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
By అంజి
మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
అమరావతి: సూపర్ సిక్స్లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండినన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000 వారి ఖాతాల్లో జమ చేస్తారు. బడ్జెట్లో ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.3,300 కోట్లు కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో నేరుగా అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు, ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడనుంది. ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లను అర్హులుగా చేసే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా మద్దతు ఇవ్వడంతో పాటు వారికి సాధికారత కల్పిస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హత కలిగిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 అందుతుంది. ఈ మొత్తం మహిళలు డబ్బు సమస్యల గురించి ఆందోళన చెందకుండా తమ దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి రోజువారీ ఖర్చులకు సహాయపడుతుంది. ఇతరులపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది.