అమరావతి: రాష్ట్రంలో పించనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతినెలా అందించే పింఛన్లను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను డబ్బులను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన నగదును ఈ నెల 30 నాటికే సచివాలయాలకు పంపించేందుకు చర్యలు చేపట్టారు.
సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఆదివారం కూడా వచ్చింది. ఈ కారణాల వల్ల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించడం ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభుత్వం, ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.