కూటమి సర్కార్ కీలక నిర్ణయం..భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు బాధ్యత వారికే

By Knakam Karthik  Published on  6 March 2025 9:33 AM IST
Andrapradesh, Ap Government, Anagani SatyaPrasad, Illegal Government Land Registration

సర్కార్ కీలక నిర్ణయం..భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు బాధ్యత వారికే

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల తహసీల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గించడంతో పాటు, రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుందని, మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములైన అసైన్డ్, నివాస స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు అధికారం ఇంతకు ముందు జిల్లా కలెక్టర్లకు ఉండేది. ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం అందితే, విచారణ జరిపించి, వాటిని రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు తెలియజేస్తారు. ఈ విధానంలో కాలయాపనతో పాటు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే తహసీల్దార్లకే నేరుగా రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని కట్టబెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

Next Story