గురుకుల పాఠశాలల విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి
గురుకుల పాఠశాలల విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
అమరావతి: రాష్ట్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థినులకు షూలు, స్పోర్ట్స్ కిట్, నైట్ డ్రెస్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. గురుకులాల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే వారి కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారు. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీ కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం రెండు స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు.
ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు టీజీటీ స్కేల్ వర్తింపజేయనున్నామని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక, ఆర్థికేతర సంబంధమైన 36 అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.