ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై సొంత మండలానికి వెళ్లకూడదు అనే నిబంధన నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అంతే కాకుండా ఉద్యోగులు సొంతవార్డులో కాకుండా ఆ పట్టణంలోని ఇతర వార్డులు మరియు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులు అని స్పష్టం చేసింది.
వార్డు, సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడంతో ఇదే తరహాలో తమకు కూడా అవకాశం కల్పించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఒకే శాఖకు చెందిన ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సరికాదని అంటున్నారు. నేడు తమకు కూడా సొంతమండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారులకు వినతీపత్రాలు సమర్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఓ ప్రకటనలో తెలిపింది.