ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ రాజధాని ప్రారంభోత్సవ పనులకు ప్రధాని మోడీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు సమాచారం. సచివాలయం వెనుక వైపు ప్రాంతంలో రాజధాని పనులు, అదే ప్రాంతంలో సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏర్పాట్లు చూడాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చేనెలరెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే నెల రెండో వారం నుంచి పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని అపాయింట్ మెంట్ ను బట్టి తేదీ ఖరారవుతుందని, అంతకు ముందే సభ వేదిక, పనులకు సంబంధించిన శంకుస్థాపనల విషయం చూడాలని చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.