ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అత్యధికంగా డిమాండ్ ఉన్న బ్రాండ్ల నుండి ఎక్కువ మద్యం కొనుగోలు చేయడానికి కంప్యూటర్ ఆధారిత మోడల్ను ఉపయోగించనుంది. అత్యధికంగా అమ్ముడుపోయే బ్రాండ్ మద్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తామని.. అయితే ప్రతి నమోదిత మద్యం బ్రాండ్ను కూడా విక్రయించడానికి అవకాశం ఇస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది. పాత మద్యం పాలసీకి స్వస్తి పలికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నేటి నుంచి సరికొత్త మద్యం పాలసీని అమలు చేస్తోంది.
కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ అన్ని మద్యం బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్రంలోకి రావడం ప్రారంభించాయని సంబంధిత అధికారులు తెలిపారు. గత ప్రభుత్వంలో మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్లను ఎంచుకునే లగ్జరీని కోల్పోయిన సంగతి తెలిసిందే. 2019 నుండి 2024 మధ్య అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాల్సి వచ్చేది.
2024 ఎన్నికలకు ముందు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాటరీ విధానం ద్వారా లభించే మద్యం దుకాణాలు తక్కువ ధరలకు అధిక నాణ్యత గల మద్యాన్ని అందజేస్తాయి. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు.