ఏపీలో నేటినుంచి కర్ఫ్యూ వేళలు స‌డ‌లింపు

AP Curfew Times Changed. ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  21 Jun 2021 3:27 AM GMT
ఏపీలో నేటినుంచి కర్ఫ్యూ వేళలు స‌డ‌లింపు

ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ వేళలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు త‌దుప‌రి నిర్ణ‌యం వెలువ‌డే వ‌ర‌కూ.. నేటినుండి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ స‌డ‌లింపులు అమ‌లులో ఉండ‌నున్నాయి. ఇక‌ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు క‌ఠిన‌మైన‌ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల‌లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇక‌ కరోనా కేసులు అధికంగా ఉండ‌టంతో తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కు మాత్ర‌మే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉద‌యం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

కర్ఫ్యూ సడలింపులతో నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది స‌ర్కార్‌. తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ కార్యాలయాలు పనిచేయనున్నాయి. తూర్పుగోదావరిలో ఉదయం 8.30 నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్ర‌మే ఆఫీస్ లు పనిచేయనున్నాయి.

ఇదిలావుంటే.. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,00,001 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 5,646 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,50,563కి చేరింది. నిన్న 7,772 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,75,176కి పెరిగింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్కరు చొప్పున 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,319కి చేరింది.


Next Story