అమరావతి: అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద కొంత అప్పు తీసుకున్నారు. అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మరాయప్ప భార్యను అప్పు చెల్లించాలని గొడవపడి.... మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేశారు.
వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బాధితురాలి పట్ల దారుణంగా ప్రవర్తించిన మునికన్పప్పతో పాటు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన వెలుగు చూసిన వెంటనే జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.