దుబాయ్ అంటే నాకు చాలా అసూయ: సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik
Published on : 23 July 2025 1:45 PM IST

Andrapradesh, Vijayawada, Cm Chandrababu

దుబాయ్ అంటే నాకు చాలా అసూయ: సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్‌.. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్‌ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. యూఏఈ అభివృద్ధిలో భారత్‌ భాగస్వామ్యం ఉండటం సంతోషకరం. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 40శాతం మంది భారతీయులే. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారింది. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారత్‌కు అపార అవకాశాలు వచ్చాయి. వికసిత్‌ భారత్‌ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది...అని సీఎం పేర్కొన్నారు.

ఉమ్మడి ఏపీలో విజన్‌ 2020 రూపొందించి రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచాం. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 575 సేవలు అందిస్తున్నాం. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలమిది. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే మా లక్ష్యం. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల వంటి అన్ని పనులు చేస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story