నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By - Knakam Karthik |
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
అమరావతి: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ అమోదం తెలపనుంది. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం అమోదం తెలపనుంది. ఇవాళ జరిగే క్యాబినెట్లో మొత్తంగా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుండగా..26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు అమరావతిలో రూ.212 కోట్ల తో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు కేబినెట్ అమోదించనుంది. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు కేబినెట్ అమోదం తెలపనుంది. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా క్యాబినెట్ లో అమోదం తెలిపే అవకాశం ఉంది. హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు క్యాబినెట్ అమోదించే అవకాశం ఉండగా..కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.