ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.

By -  Medi Samrat
Published on : 3 Oct 2025 6:59 PM IST

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సుమారు 20 అజెండా అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలుస్తూ రూ. 15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు కేబినెట్ రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, అమరావతిలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడానికి ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ఎస్‌పీవీ ద్వారా నిధుల సమీకరణ, పనుల పర్యవేక్షణ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు, ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాని మిగిలిన భూములను భూసేకరణ చట్టం ప్రకారం సేకరించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన 'ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్)' పాలసీ 2024-29కి సంబంధించిన అనుబంధ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు 'కారవాన్ టూరిజం' పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఏర్పాట్లపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. కర్నూలులో జరగనున్న ఎన్‌డీఏ ర్యాలీ, జీఎస్టీ తగ్గింపుపై రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా అవగాహన సభలు నిర్వహించాలని మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Next Story