గురువారం నాడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. గురువారం రాత్రి నీరసంగా ఉన్న ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావు పలు వైద్య పరీక్షలు చేశారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే తనకు నయం కాని వ్యాధి వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి అంటూ ఆయనే స్వయంగా వీడియోను విడుదల చేశారు. త్వరలోనే నేను ప్రజాహిత కార్యక్రమాలకు వస్తాను.. ప్రజల సంక్షేమం కోసం నేను కచ్చితంగా పర్యటిస్తానన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తానని.. ఇది నా బాధ్యత అని అన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది అంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు యథాతథంగా హాజరవుతానని తమ్మినేని తెలిపారు.