అమరావతి: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'తల్లికి వందనం' పథకంకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న విద్యార్థుల డేటాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారంతో సరిపోలుస్తోంది.
గతంలో సచివాలయాల ద్వారా నిర్వహించిన డేటా ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. గత రెండు రోజులుగా దీనిపై అధికారులు సమీక్షలు చేయగా.. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలలోనే ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విద్య శాఖ - సచివాలయ సిబ్బంది సమావేశాలు కొనసాగుతున్నాయి. తుది జాబితా ఖరారు తరువాత అర్హుల వివరాలు.. పథకం అమలు తేదీ పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2025-26 వార్షిక బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించింది. రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. ప్రాధమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమయం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన ఉండనుంది.