ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు సమీపంలో రూ.1622 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. కూల్డ్రింక్స్, పండ్ల రసాలు, డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించిన పరిశ్రమను స్థాపించేందుకు రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సర్కారు ఆదేశాల్లో తెలిపింది.
కాగా రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఈ నెల 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం లభించింది. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ప్లాంట్ ఏర్పాటు కోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీఐఐసీ చైర్మన్, ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.