ఏపీలో వర్షాలతో అలర్టయిన ప్రభుత్వం, సహాయ చర్యలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
By Knakam Karthik
ఏపీలో వర్షాలతో అలర్టయిన ప్రభుత్వం, సహాయ చర్యలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై హోంశాఖ మంత్రి అనిత ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాగా రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే తెలిపింది. కొన్నిచోట్ల ఎండ, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా సోమ, మంగళవారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలిపింది. మరోవైపు రానున్న రెండురోజుల్లో ఉష్ణోగ్రతలు 41.5 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.